Saturday, January 11, 2025

ప్రాతాదిసంధి

 *ప్రాతాది సంధి* 


'ప్రాతాదులు' అంటే ప్రాత,క్రొత్త,లేత,కెంపు,చెన్ను,మీదు,పూవు మొదలగు పదాలు.

సూత్రము.1

సమాసంబునం బ్రాతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు (బాల వ్యా.సంధి.36)

ప్రాఁత మొదలైన పదాలతో రెండవ పదానికి సమాసం జరిగినపుడు 'ప్రాఁత'లోని మొదటి అచ్చు వరకు మిగిలి, తక్కిన అక్షరాలు లోపిస్తాయి.అంటే 'ప్రా'అనేది మాత్రమే మిగిలి ఉంటుంది.

(మిగతా పదాలలో కూడా మొదటి అక్షరం మాత్రమే మిగులుతుంది.)

ఇలా లోపించడం బహుళం కాబట్టి, కొన్ని పదాలలోని అక్షరాలకు లోపం  ఉండక పోవచ్చు.

ఉదాహరణకు,

ప్రాఁత+ ఇల్లు=ప్రాయిల్లు,ప్రాఁతయిల్లు

(ఇక్కడ 'త' లోపించినపుడు యడాగమం వచ్చినది.)

లేఁత+దూడ= లేదూడ,లేఁతదూడ

పూవు+రెమ్మ=పూరెమ్మ, పూవు రెమ్మ 

పై రెండు ఉదాహరణలు కర్మదారయములు, మూడవది తత్పురుషము.


సూత్రం 2.

లుప్తశేషమునకుం బరుషములు పరములగునపుడు నుగాగమంబగు.(సంధి.సూ.37)

పై సూత్రము ప్రకారము లోపించగా మిగిలిన అక్షరానికి పరుషాక్షరాలు (క,చ,ట,త,ప) పరమైనపుడు న కారం(న్) ఆగమం గా వస్తుంది.

ఉదా:

ప్రాఁత + కెంపు = ప్రాఁగెంపు

లేఁత + కొమ్మ = లేఁగొమ్మ

పూవు + తోఁట = పూఁదోట

మీఁదు + కడ = మీఁగడ

కెంపు + తామర=కెందామర

చెన్ను + తొవ = చెందొవ 

న కారం ద్రుతం కాబట్టి,ద్రుతానికి వచ్చే కార్యాలు ఇక్కడ వర్తిస్తాయి.

ప్రాఁత+ కెంపు ; ప్రా + కెంపు;(సూ.36) ప్రా+న్+కెంపు (సూ.37)

ప్రాన్+కెంపు (సూ.16),న కారం అరసున్న గా మారి ప్రాఁగెంపు(సూ.17) అవుతుంది.

అయితే ఇక్కడ ’ప్రాగెంపు' అనే రూపం ఒక్కటే ఉంటుంది.'ప్రాంగెంపు' , 'ప్రాన్గెంపు', 'ప్రానుగెంపు'  రూపాలు ఉండవు.

దీర్ఘంమీద నిండుసున్న రాదు.కాబట్టి 'ప్రాంగెంపు' రూపం ఉండదు.

ఈ సూత్రం వివరణలో వ్యవస్థిత విభాషచే ద్రుతమునకు సంశ్లేషంబు లేదు.అని చెప్పినందువల్ల 'ప్రాన్గెంపు' కాదు.సమాసాలలో ద్రుతానికి స్వత్వరూపం లేదు కాబట్టి 'ప్రానుగెంపు' అనే రూపం కూడా ఏర్పడదు.

36 వ సూత్రంలో బహుళము అని చెప్పినందువల్ల తొలియచ్చు మీది వర్ణములకు లోపం రానప్పుడు 'ప్రాంతకెంపు' అని ఉంటుంది.

మీఁగడ,కెందామర,చెందొవ అను రూపాలు ఏర్పడే పద్ధతి కూడా ఇదే.కానీ,ఈ మూడు పదాలలో లోపం నిత్యం.కాబట్టి, మీఁదుకడ,కెంపు తామర,చెన్నుతొవ అను రూపాలు ఏర్పడవు.

కెందామర,చెందొవ పదాలలో ద్రుతం నిండుసున్న గానే మారింది.

ఎందుకంటే, సంధి 22 వ సూత్రం ప్రకారం తొలి హ్రస్వం మీద సున్నయే గాని అరసున్న ఉండదు.

ఇక, 

'చెన్ను' శబ్దం సమాసం లో కాకుండా విడిగా ఉన్నప్పుడు అందము, విధము అనే అర్థాలను తెలుపుతుంది.సమాసంలో మాత్రం 'ఎఱుపు' అనే అర్థాన్ని ఇస్తుంది.

(చెందొవ=ఎఱ్ఱ కలువ)

(వ్యవస్థితవిభాష అంటే ఇది ఇక్కడ వస్తుంది,ఇది ఇక్కడ రాదు అనే నియమాలను ఏర్పరచిన విభాష. )


సూత్రం.3:

క్రొత్త శబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్నియెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు. (సంధి.సూ.38)


సమాసం లో వేరొక పదం పరమగునపుడు, 'క్రొత్త 'శబ్దంలో 'త్త' లోపించగా మిగిలి ఉన్న 'క్రొ' అక్షరానికి కొన్ని చోట్ల నకారం (న్) ఆగమం అవుతుంది.మరికొన్ని చోట్ల పరమైన హల్లునకు ద్విత్వం వస్తుంది.


క్రొత్త + చాయ = క్రొంజాయ

క్రొత్త + చెమట = క్రొంజెమట

క్రొత్త + పసిడి =  క్రొంబసిడి

క్రొత్త + కారు =  క్రొక్కారు

క్రొత్త + తావి = క్రొత్తావి 


'క్రొత్త' శబ్దం కూడా ప్రాతాదులలోనిదే.

ఈ సూత్రం ప్రకారం నుగాగమం వస్తుంది కానీ,ద్విత్వం రావడం లేదు.

దీనికి కారణం 'క్రొ' అక్షరానికి పరుషాక్షరాలు పరమైనపుడు మాత్రమే 'నుగాగమం' వస్తుందని అర్థమవుతున్నది.

క్రొత్త+చాయ ~క్రొ+ చాయ ~ క్రొ+న్+చాయ ~ క్రొంజాయ 

(సమాసం లో ద్రుతానికి స్వత్వరూపం లేనందున 'క్రొనుజాయ' ; 22 వ సూత్రం ప్రకారం అరసున్న లేనందున 'క్రొఁజాయ' 36 వ సూత్రం లోని వివరణ ననుసరించి సంశ్లేష లేనందున ' క్రొన్జాయ' అను రూపాలు ఏర్పడవు.)

క్రొంజెమట, క్రొంబసిడి రూపాలు పై విధంగానే ఏర్పడుతాయి.

'క్రొక్కారు' అనుచోట మొదట 'క్రొత్త+ కారు' అని ఉంటుంది.ఈ సూత్రం ప్రకారం ద్విత్వం వచ్చింది.

ఇదేవిధంగా ' క్రొత్తావి' కూడా.


పరుషాక్షరాలు ఇతరములైన వర్ణాలు పరమైనపుడు,నుగాగమం రాదు . 'ద్విత్వం' మాత్రమే వస్తుంది.

క్రొత్త + గండి = క్రొగ్గండి

క్రొత్త + నన = క్రొన్నన 

క్రొత్త + మావి= క్రొమ్మావి

ఇవి కాక ,

కెంధూళి,కెంజడలు అని కవి ప్రయోగాలున్నాయి.

ఇవి సూత్రములకు లొంగని ప్రయోగములని చిన్నయసూరి గారు తెలియజేశారు.

కెంపు+జడలు= కెంజడలు అనుచోట రెండూ ఆచ్ఛిక పదాలే .

అయినప్పటికీ ' జడలు ' లోని మొదటి అక్షరం సరళం కాబట్టి, సూత్రం ప్రకారం సరళాలు పరమైనపుడు ద్విత్వం రావాలి.అలా వస్తే' కెజ్జడలు' అనే అసాధురూపం యేర్పడుతుంది.

కాబట్టి, సూత్రానికి లొంగని రూపమని చూపించారు.


 *క్రొత్త కుండలు* 


క్రొత్త కుండలు అన్నప్పుడు 'క్రొత్త ' లోని 'త్త' లోపించలేదు.

రెండవ పదంలో పరుషాక్షరం (క) ఉంది.దానికి నకారంగాని,ద్విత్వం గాని రాలేదు.దానికి కారణం ప్రాతాది సూత్రంలో 'బహుళము ' అని చెప్పడం వల్లనే.

'ప్రయోగశరణం వ్యాకరణం 'అన్నట్లు ప్రయోగాల ననుసరించి ఈ వ్యాకరణ కార్యాలు చేయవలసి ఉంటుంది.

అందువల్లనే, 

క్రిందు+ కడుపు= క్రీఁగడుపు

క్రిందు+ కాలు = క్రీఁగాలు

క్రిందు+ తొడ = క్రీఁదొడ

వంటి పదాలలో లోపించగా మిగిలిన 'క్రి' అను అక్షరానికి దీర్ఘం వచ్చి 'క్రీ' అయినది.

ఈ దీర్ఘాన్ని ఏ సూత్రం విధించలేదు.

సూత్రంలో 'బహుళము' అని చెప్పినందువల్ల ఇవి సాధ్యమైనవని గ్రహించాలి.


సూత్రం.4 :

అన్యంబులకు సహితమిక్కార్యంబులు కొండొకచో కానంబడియెడి.(సంధి.సూ.39)


ప్రాతాదులకంటే వేరయిన పదాలకు కూడా సూత్రాలచే సాధింపబడని (లోప నుగాగమములు,లోప ద్విత్వములు) కార్యములు కనబడుతున్నవి.


పది+తొమ్మిది= పందొమ్మిది 

తొమ్మిది+ పది= తొంబది

వంక+ చెఱఁగు = వంజెఱఁగు

సగము+కోరు = సంగోరు 

నిండు+ వెఱ = నివ్వెఱ

నిండు+వెఱఁగు=నివ్వెఱఁగు

నెఱ + తఱి = నెత్తఱి

నెఱ + నడుము= నెన్నడుము 

నెఱ+ మది = నెమ్మది 

నెఱ + వడి = నెవ్వడి


'పందొమ్మిది ' అనుచోట 'పది' ప్రాతాదులలో చేసుకున్నప్పటికీ, మొదటి అక్షరం మాత్రమే మిగిలి,నుగాగమం వచ్చి,ద్రుతకార్యాలైన నిండు సున్న,సరళాదేశాలు వచ్చాయి.

(పది+తొమ్మిది ~ప+తొమ్మిది ~ప+న్+తొమ్మిది ~పందొమ్మిది)


'నివ్వెఱ' మున్నగు పదాలకు లోపము, ద్విత్వము వచ్చి సాధు రూపాలు ఏర్పడినవి.

(ఆధారం: బాలవ్యాకరణం లఘుటీఁక.)