Thursday, September 20, 2018

బోయి భీమన్న

ఈ రోజు (సెప్టెంబర్ -19) ప్రముఖ కవి పద్మ భూషణ్ *డా. బోయి భీమన్న* గారి జయంతి సందర్భం గా వారిని స్మరిస్తూ చిరు వ్యాసం ..... *ఐ.చిదానందం* ------------------------------------------------------------ సాహిత్యం లో తాము ఎంచుకున్న సిద్దాంతాలకు కట్టుబడి జీవితకాలం ఆ సిద్దాంత సూత్రాలకే లోబడి రచనలు చేసే వారు తక్కువ మంది వుంటారు అలాంటి తక్కువ మందిలో విశిష్టమైన వ్యక్తి డా.బోయి భీమన్న. *నాకు తిండి దొరక్కపోతే* *నేను పస్తులుండను* *ఉపవాసాలు చేస్తాను* *నాకు పేదరికం లేదు* *నాకు బట్టదొరక్కపోతే* *నేను చింకి పాత బట్టలు కట్టను* *దిగంబరోద్యమం చేస్తాను* *నాకు పేదరికం లేదు* అంటూ తాను ఎవ్వరికీ తలవంచను అంటూ ఆత్మభిమానం తో జీవించిన వ్యక్తి డా. బోయి భీమన్న. వీరు 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. వీరు తన రచనల ద్వారా సామజికం వెనుకబడిన దళితులకు చైతన్య స్పూర్తిని ఇచ్చారు. మనిషి శాసిస్తున్న కులవ్యవస్థ పైన ఎక్కుపెట్టిన బాణాలు వీరి రచనలు . *బోయి భీమన్న రచనలు* * అనాది కొసనుంచి * అనంతతత్త్వంలోకి * రాగవైశాఖి * రాఖీలు (కవితా సంకలనం). * గుడిసెలు కూలిపోతున్నై (కవితాసంపుటి ) (దీనికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది) * భీమన్న ఉగాదులు * భీమన్న కావ్యకుసుమాలు * మోక్షం నా జన్మహక్కు * చివరిమెట్టుమీద శివుడు * కూలీ శతకం * రాగోదయం * అకాండతాండవం * గిల్లిచెబుతున్నా * మధుబాల * మధుగీత * దీపసభ *నాటకాలు* * పాలేరు * కూలిరాజు * అసూయ * ప్రగతి * పడిపోతున్న గోడలు * రాగవాసిష్ఠం * ఆదికవి వాల్మీకి * వేదవ్యాసుడు * ధర్మవ్యాధుడు * బాలయోగి * చిత్రకళాప్రదర్శనం (నాటికల సంపుటి) * చండాలిక (టాగూర్ రచించిన చండాలిక నాటికకు అనువాదము) *వచన రచనలు* * ఏకపద్యోపాఖ్యానం *ఇదిగో ఇదీ భగవద్గీత * జన్మాంతర వైరం * ధర్మం కోసం పోరాటం * అంబేద్కరిజం * అంబేత్కరమతం * జానపదుని జాబులు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా. బోయి భీమన్న పేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురితం చేసారు. వీరి రచనల విషయం కు వస్తే మొదటగా చెప్పుకోవలిసినది . గుడిసెలు కాలిపోతున్నాయి. *గుడిసెలు కాలిపోతున్నై* *ఓహో కాలిపోతున్నై* *ఎవరీ గుడిసెలో పాపం* *మాల మాదిగలవే అయివుంటై* *గుడిసెలు మరివరికుంటై* *ధర్మ సంస్థాపనార్ధం* *ఈ గుడిసెలు* *మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటే* *పోతుంటై పుట్టుకొస్తుంటై* --------------------------------- *కాలిపోయిన గుడిసె స్థానం లో* *మరో గుడిసెలేస్తే ఏం లాభం* *అభ్యుదయం ఏలా సాధ్యం* అంటారు భీమన్న .ఇలా *గుడిసెలు కాలిపోతున్నై* (1973) కావ్యంలో రాజకీయ నాయకుల ధోరణీ ని దుర్నితిని ఎండగట్టారు. ఇక వీరి రచనలలో *పిల్లీ శతకం* అనేది ప్రత్యేకమైనది. *ఓయమ్మ నీ కుమారుడు* *మా యిండ్ల పాలుపెరుగు మననీ డనుచున్* *ఏ యమ్మ నిను స్మరించదు* *నీ యున్నదే గోకులమ్ము నిజముగ పిల్లీ* *తుంటరి యేలుకలు గొట్టుచు* *పంటను రక్షించు నీవు పాలడిగినచో* *కంట తడిపెట్టుకొందురు...!* *తుంటరు లీ నరులు చాల ! తూ తూ పిల్లీ!* పిల్లీ ఎదురైతేనే అపశకునం గా భావించే మూఢనమ్మకాలపైన వ్యంగ్యం గా హాస్యం గా వీరి రచన సాగుతుంది. *పిల్లీని చంకను బెట్టుక* *వెళ్లుటయను పిచ్చినుడులు విశ్వాసముల్* *చెల్లవిక నిన్ను గైకొని* *ఢిల్లీ వరకేగవచ్చు తెలియవే? పిల్లీ* వీరు రాసిన త్రిపదలు కూడా కవితా ప్రక్రియ పరంగా గాఢమైన సాంద్రత కలిగినవే... *నీవు నా యెదురుగా వుండగా* *బొమ్మల్ని చూస్తూ కూర్చోలేను నేను* *అవెంతటి అమర చిత్ర శిల్పలైనా* *నీవు శరీరాన్ని కోరడం లేదు* *నేను శరీరాన్ని కోరడం లేదు* *శరీరాలు మాత్రమే మనల్ని కోరుతునై* *సుఖాన్ని కోరుతుంది శరీరం* *మడిగట్టుకుంది మనస్సు* *తన్నుకు చస్తున్నది ఆత్మ* *వంగితే సవారీ చేస్తుంది* *సవారీ చేస్తే వంగుతుంది లోకం* *గుఱ్ఱమో రౌతో ఎంచుకొ నీవే* ఇలా వీరి కవిత్వ రచనలలో పంచ్ విరుపులు చదివిన కొద్దీ ఆలోచింపచేస్తాయి. *భీమన్న రాసిన కొన్నీ కవితా పంక్తులు *గిరి తనయ లేచి వెళ్ళెను* *త్వరపడు మన్నటి తలుపు తలముడి విప్పేన్* *సరదా తీరెనా లేదో* *పరమేశా గంగ విడుము పార్వతి వచ్చెన్* చాటువులు *ఏ గవర్నమేంటాస్పత్రికీ కెళ్ళినా* *ఏమున్నది గర్వ కారణం* *పేరున్న ప్రతి డాక్టరూ* *యింటికీ రమ్మనవాడే* *సొంత క్లీనికులున్న వాడే* *ఏ ప్రభుత్వ ఆసుపత్రికెళ్ళినా* *ఏమున్నది గర్వకారణం* *ప్రతి ఉద్యోగి తన ఉద్యోగాన్ని* *డబ్బిచ్చి కొనుక్కున్న వాడే* *తన బిడ్డలకు కోనివ్వలిసినవాడే* చివరి మెట్టు కింద శివుడు *బలం కలవాడు పులి* *తెలివి కలవాడు నక్క* *యీ ఇరువర్గాలకు ఆహారంగా* *బతుకుతున్న మూర్ఖులు గొర్రెలు* నాలుగు వర్ణాలన్నది హిందుయిజం* *రెండు వర్గాలన్నది కమ్యూనిజం* *ఈ వర్ణ విభజన వర్గ విభజన* *చేసింది పులినక్కాయిజం* *వీరికొచ్చిన పురస్కారాలు * కళా ప్రపూర్ణ - 1971 * పద్మశ్రీ పురస్కారం - 1973 * కాశీవిద్యాపీఠం గౌరవ డాక్టరేట్ - 1976 * పద్మ భూషణ్ పురస్కారం - 2001 * కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు * నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ వీరు రాసిన మరో విశిష్ట రచన *పైరు పాట*’ తెలుగులో ప్రణయతత్త్వ ప్రతీకీకరణను అభ్యుదయాదర్శాలతో ప్రవేశపెట్టిన ప్రప్రథమ గేయనాటిక . ఇదీ మొదట *స్నేహ* అన్నపేరుతో ఆకాశవాణిలో ప్రసారితమై, ఆ తర్వాత *స్నేహసుందరి* అన్నపేరిట ఒక వారపత్రికలో ప్రకటితమైంది. ముద్రణ నాటికి ‘పైరు పాట’ అన్న పేరుతో ప్రచురితమైనది. ఈ రూపకంలో కథానాయిక స్నేహ ఒక మాల పిల్ల. పేదరికంలో పెరిగి పెద్దయిన యువతి. పైరుచేల గట్లలో పచ్చగడ్డి కోసుకొనేందుకు ప్రతి సాయంత్రమూ పొలాల్లోకి వస్తుంటుంది. ఒక కామందు ఇంట్లో పాలేరుతనానికి కుదురుకొంటుంది. యజమాని ఇంటిపనులు నిర్వర్తించడం, పశువుల మేతకోసం ప్రతిరోజూ పంటపొలాల్లో తిరిగి గడ్డి కోసుకొని ఇంటికి తిరిగివెళ్ళటం, పంటతల్లి అందాలకు ఆనందించటం ఆమె దినచర్య. శీల ఆమె స్నేహితురాలు. ఆమెకూడా ఒక కామందు ఇంట్లో పనికి కుదిరినదే. శ్రీవత్స అనే అగ్రకుల విద్యావంతుడు ఆ పొలాల్లోనే షికారుకు వచ్చి స్నేహను చూసి ఆమెతో స్నేహం చేస్తాడు. ఇద్దరి మనస్సులూ ఆకర్షణకు లోనై, స్నేహం ప్రణయంగా మారటాన్ని భీమన్నగారు చాలా సున్నితంగా చిత్రించారు. శీల తన స్నేహితురాలి చిత్తవిభ్రమాన్ని గుర్తించి ఆమెను హెచ్చరిస్తూ ఉంటుంది. స్నేహ తాను గతి తప్పుతున్నానేమో అని భయపడుతుంది. ఎంత అభ్యుదయవాది అయినా అగ్రకులస్థుడు, గొప్పోళ్ళ బిడ్డ అయిన శ్రీవత్స తనను పెళ్ళి చేసుకుంటాడో లేదో అని కలవరపడుతుంది. అందనిదానికోసం ఎగబడుతున్నానేమో అని వెనకాడుతుంది. తన మనస్సును కట్టడి చేసుకొనే ప్రయత్నంలో అతనికి కనబడటం మానేస్తుంది. శీల అయోమయంలో పడుతుంది. శ్రీవత్సకు ఆందోళన కలుగుతుంది. శీలను అడిగి విషయం తెలుసుకొని ఆమె అనుమానాలను, అభ్యంతరాలను పరాస్తం చేసి స్నేహను పెండ్లిచేసుకొంటాడు. వీరి రచనల్లో ఈ కథ లో లాగే మన సమాజం లో కూడా ప్రేమించుకొన్న యువతి యువకులకు పెద్దల అనుమతి ఇచ్చి వారిని మనసారా ఆశీర్వాదిస్తే ఎంత ఆదర్శం గాఉంటుంది

Wednesday, September 19, 2018

తాపీ ధర్మారావు


నేడు తాపీ ధర్మారావు జయంతి
*****************************


*" దేవుడివైపు కాళ్ళు పెట్టి చదువుకుంటున్నావేమిటి ? తియ్ ! "* అని కోప్పడిన తల్లితో  *"దేవుడు ' అందుగలడిందులేడని సందేహంబు వలదు '                  అన్నారు కదమ్మా ! మరి కాళ్ళెక్కడ పెట్టుకోవాలి ? " అని కుర్రతనంలోనే అహేతుక భావాలను ప్రశ్నించిన గడుగ్గాయి.           '  నూనె కావడి ఎదురొస్తే అశుభం'*  అని  అందరూ వారించినా లెక్కచేయకుండా వెళ్లి ఎఫ్.ఏ పరీక్ష ఫస్ట్ క్లాసులో పాసైన తెలివైన నాస్తికుడు,
పెద్దయ్యాక  *దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?* అని ఆలొచించడమే కాక ఏకంగా పుస్తకమే రాసి భక్తజనావళికి  చెమటలు పట్టించిన హేతువాది, *1887 సెప్టెంబర్ 19న బరంపురంలో పుట్టిన తాపీ ధర్మారావు*  గారి ఇంటిపేరు బండివారో బండారువారో అని ఉండేదట. *వీరి తాతగారు తాపీ పనిలో పేరు తెచ్చుకోవడం వల్ల* అదే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.

 *నూతన పోకడలపై మొదటినుంచీ ఆసక్తే :* బడి రోజుల్లోపంచెకట్టుకోవాలనిపించి అందరూ ఎడమచేతి వైపు గోచీ పెడితే " ఏం ? అలాగే ఎందుకు కట్టాలి ?అంటూ కుడిచేతివైపు పెట్టి కట్టుకుని బడికి వెళ్లారు.అందరూ నవ్వారు.మాస్టారు హెచ్చరించారు." నేనిలాగే కడతానని ఎదురు చెప్పడమే కాదు.జీవితాంతమూ అలాగే కట్టారు.

*తన పెళ్లి విషయంలో ఆనాటి సంప్రదాయం పై తిరుగుబాటు:*  పెళ్లి చూపుల్లో -పిల్లకు చదువు తప్పని సరి.పెళ్ళికిముందు ఒకరినొకరుచూసుకోవాలి.కట్నాల ప్రసక్తి కూడదు.భార్యను ఏమేవ్ ,ఏయ్అనికాకుండాపేరుపెట్టి  పిలుచుకోవాలి.నాటకాలకు వెళ్ళినప్పుడు వెంటతీసుకెళ్లి తన పక్కనకూర్చోబెట్టుకోవాలి.అనే షరతులు పెట్టారు. *ఈనాడివి అల్ప విషయాలు.కానీ 1902-1903 కాలంలో అభ్యుదయ భావాలు.*

*లెక్కల మాస్టారుగా ఉద్యోగం ప్రారంభించి  ఉప్పల లక్ష్మణరావు గారూ వి.వి.గిరి వంటి గారికీ పాఠాలు చెప్పారు.* కొన్నాళ్ళు  సర్వే డిపార్టుమెంట్ లో పనిచేసి,తరువాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు.బొబ్బిలి రాజా సోదరుడికి ట్యూటర్ గా పనిచేశారు.చివరకు పత్రికా రంగంలో స్థిరపడ్డారు.

*దేవాలయాలపై కనిపించే బూతుబొమ్మలన్నీ గుడులలో  జరిగే  సంగమాలను తెలిపేవే*  అంటూ 1936లో ప్రజామిత్ర పత్రికలో రాసిన వ్యాసాలను   *'దేవాలయాలమీద  బూతుబొమ్మలెందుకు ?"* అనే పుస్తకంగాప్రచురించారు.అదే పత్రికలో  ' కొత్తపాళీ '*  వ్యాసాలను ధారావాహికంగా ప్రచురించారు.  *తనకు పుట్టినవాడే తన ఆస్తికి వారసుడు కావాలన్న తపనే* *' ఇనుప కచ్చడాలు'* 'కు మూలం అన్నారు. *'అడగజాలనివాడు* అనే పేరుతొ రాసిన వ్యాసాలను " *ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ"* పుస్తకంగా వెలువరించారు.

*ఆదిలో మగపెళ్లి వారూ ఆడపెళ్ళివారూ తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవడం వంటి అతి సామాన్య తంతులోకి పిలవని పేరంటంగా పురోహితుడు ప్రవేశించి ఏవోవో మంత్రాలు అల్లి నానా రకాల కర్మకాండను కల్పించి పెళ్లిని " పెద్ద భూతంగా ఎలా మార్చాడో   " పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు"* లో వివరించారు.1937లోసినీరంగం లో అడుగుపెట్టి మొదట " మోహినీ రుక్మాంగద " కీ *చివరగా 1962లో " భీష్మ సినిమాకీ* సంభాషణలు రాశారు.చేమకూర వెంకటకవి ' విజయవిలాస' కావ్యానికి *సహృదయోల్లస వ్యాఖ్య* రాసి సంప్రదాయ పండితుల ప్రశంసలందుకున్నారు.

ఏదైతేనేం వెయ్యిముఖాలతో వెలిగిన జీవితం పూలబాటలూ ముళ్లపుంతలూ చవిచూసిందని *" రాళ్ళూ రప్పలూ "*  వర్ణించిన 86 సంవత్సరాల జీవితం అలసిపోయి *1973 మే 8 న శాశ్వత విశ్రాంతి* తీసుకుంది.                                                                                                                                                                                                                                                                                       ( *ఈ రోజు తాపీ ధర్మారావుగారి జయంతి*)

సేకరించబడిన సమాచారము.